కరీంనగర్ విశ్వ బేకరీలో అగ్నిప్రమాదం

కరీంనగర్ జ్యోతినగర్లో విశ్వ బేకరీలో అగ్నిప్రమాదం
రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం.. పాత పేపర్లు, పుస్తకాలు దగ్ధం
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్ జగిత్యాల రోడ్డులో ఉన్న విశ్వ బేకరీలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్ సమయంలో ఒక్కసారిగా బేకరీ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొద్దిసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా బేకరీలోని సామగ్రి, ఇతర వస్తువులు కాలిపోయినట్లు సమాచారం.
ఇదే ప్రాంతంలో మూసివేసి ఉన్న ఓ హాస్టల్లో నిల్వ ఉంచిన పాత పేపర్లు, పుస్తకాలు సైతం మంటలకు ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత విస్తరించకుండా నివారించారు.
ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ వైర్ కట్ కావడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.