ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం
వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు
టేక్మాల్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
టేక్మాల్ మండల పరిధిలోని సాలోజిపల్లి గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన ఐదు అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వనుల నడుమ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.
ఈ సందర్భంగా గత మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాది కార్యక్రమాలు నిర్వహించారు. నిర్ణీత ముహూర్త సమయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో పాటు యంత్ర స్థాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారికి పాలాభిషేకం, మహానివేదన, మహాహారతి కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ పూజా కార్యక్రమంలో ప్రముఖ గురువులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేదపండితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించగా, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.