ఎలిగేడులో గంజాయి సేవించిన ఏడుగురు యువకులను గుర్తించి డి అడిక్షన్ కేంద్రానికి తరలించిన పోలీసులు

ఎలిగేడ్లో గంజాయి సేవించిన ఏడుగురు యువకుల గుర్తింపు
డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించేందుకు పోలీసుల చర్యలు
రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గంజాయి వినియోగం, అక్రమ రవాణా, సరఫరా, నిల్వపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్రావు నేతృత్వంలో ఎస్ఐ లక్ష్మణ్, ఎలిగేడ్ ఎస్ఐ మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్దపల్లి జోన్లోని ఎలిగేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ఫోర్స్ బృందం, ఎలిగేడ్ పోలీసులు సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలిగేడ్ గ్రామ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు యువకులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో తాము గంజాయి సేవించినట్లు యువకులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో వారిని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య, క్లినికల్ పరీక్షలు నిర్వహించారు. గంజాయి సేవించినట్లు నిర్ధారించేందుకు అవసరమైన పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, వారిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ
యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉక్కుపాదంతో వ్యవహరిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం వంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.
మాదకద్రవ్యాల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
గంజాయి వినియోగం, విక్రయం, అక్రమ రవాణా లేదా నిల్వకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీపీ సూచించారు.