వ్యవసాయ అధికారులను నిలదీసిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు యూరియా కొరతతో రైతుల తీవ్ర ఇబ్బందులు

రైతులకు సకాలంలో యూరియా అందించాలి
వ్యవసాయ అధికారులను నిలదీసిన సర్పంచ్ కుంటెల్లి నాగరాజు
యూరియా కొరతతో రైతుల తీవ్ర ఇబ్బందులు
సమస్య పరిష్కరించకుంటే ధర్నా, రాస్తారోకోకు సిద్ధం
కొలనూరు సొసైటీ పరిధిలో రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలి
తెలంగాణ అడ్డా – కొనరావుపేట ప్రతినిధి:
రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యూరియా సరఫరా చేయాలని సుద్దాల గ్రామ సర్పంచ్ కుంటెల్లి నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం సుద్దాల గ్రామానికి చెందిన రైతులతో కలిసి మండల వ్యవసాయ విస్తరణ అధికారి, క్లస్టర్ ఏఈఓను కలిసి రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరారు.
పంటలకు ప్రభుత్వం అందించాల్సిన మేరకు యూరియా సకాలంలో అందుబాటులో లేకపోవడంపై సర్పంచ్ నాగరాజు వ్యవసాయ అధికారులను నిలదీశారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల సాగు కీలక దశలో యూరియా కొరత ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
కొలనూరు సొసైటీ పరిధిలోని రైతులకు తక్షణమే అవసరమైన మేరకు యూరియాను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందించని పక్షంలో పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి యూరియా సమస్యను పరిష్కరించాలని నాగరాజు కోరారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సుద్దాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా కొరతపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.