కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ విమర్శలు

కరీంనగర్లో కేటీఆర్ ‘యువ సమర భేరీ’ అట్టర్ ఫ్లాప్
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ విమర్శలు
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా
కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ కార్యక్రమం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యువత సమస్యలను పట్టించుకోని కేటీఆర్కు అధికారం కోల్పోయిన తర్వాతే యువత గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
శనివారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మేయర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల మధ్య నుంచి, కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన బండి సంజయ్ను విమర్శించే ముందు కేటీఆర్ తన రాజకీయ చరిత్రను పరిశీలించుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలు, పేపర్ లీకేజీలు, 317 జీవో వంటి అంశాలతో యువత, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలపై కేటీఆర్ ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు శాతవాహన యూనివర్సిటీకి 12బీ హోదా, ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా సాధించడంలో కీలకంగా కృషి చేశారని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి కేటీఆర్ తెచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని రాజకీయ సభలు నిర్వహించినా యువతను మోసం చేసిన బీఆర్ఎస్ చరిత్రను ప్రజలు మరిచిపోరని మేయర్ కొలగాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.