నిమ్మపెల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

కాంగ్రెస్ హామీలపై ‘బాకీ కార్డులు’ పంపిణీ
నిమ్మపెల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
కోనరావుపేట, తెలంగాణ అడ్డా ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారెంటీ కార్డులకు బదులుగా ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రజలకు ఈ కార్డులను అందజేశారు.
రైతులకు రూ.500 బోనస్, మహిళలకు పింఛన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, కళ్యాణలక్ష్మి–షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం, ఉపాధి కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్షించేందుకు గ్యారెంటీ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలును విస్మరిస్తున్నారని వారు మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు జరిగే వరకు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంగల్ తిరుపతి గౌడ్, పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్ర దేవయ్య, మాజీ సర్పంచ్ కదిరి శ్రీనివాస్, నల్ల గోవర్ధన్, ఉపసర్పంచ్ దొంతరవాణి శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.