జగదాంబ దేవి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

జగదాంబ దేవి ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
భూక్యా బాలు నాయక్ ఔదార్యం.. ఆలయ కమిటీకి రూ.65 వేల నగదు అందజేత
వీర్నపల్లి/సిరిసిల్ల, తెలంగాణ అడ్డా:
స్థానిక భావుసింగ్ నాయక్ తండా, గోనా నాయక్ తండా, గోలియ నాయక్ తండా పరిధిలోని శ్రీ జగదాంబ దేవి ఆలయ అభివృద్ధికి తండాకు చెందిన ప్రముఖుడు భూక్యా బాలు నాయక్ తనవంతు సహాయాన్ని అందించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.65,000 నగదును ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో శనివారం ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
ఈ సందర్భంగా భూక్యా బాలు నాయక్ మాట్లాడుతూ.. జగదాంబ దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు తనవంతు బాధ్యతగా ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు అందించే సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, తండావాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.