ప్రజాభవన్లో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష

ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట
ప్రజాభవన్లో ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఈహెచ్ఎస్ పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మానవీయ దృక్పథంతో ఈహెచ్ఎస్ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 354 ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఉద్యోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరిన్ని ఆసుపత్రులను ఎంప్యానెల్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
అర్హులైన ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందేలా జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.