రత్నంపేటలో గుంతల సమస్యలు పరిష్కరించాలి

రత్నంపేటలో గుంతల సమస్యలు పరిష్కరించాలి
పూర్తిగా విఫలమైన గ్రామపంచాయతీ పాలకవర్గం
గ్రామపంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలి: సీపీఎం
బోయిన్పల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చి, మరమ్మతు పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని మండల సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
గ్రామంలో రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్య పరిష్కారానికి గ్రామపంచాయతీ పాలకవర్గం తగిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం నాయకులు ఆరోపించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా సంబంధిత అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జిల్లా కలెక్టర్, మండల ఎంపీడీవో వెంటనే స్పందించి రత్నంపేట గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పాలకవర్గంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గ్రామపంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామంలోని గుంతల సమస్యను పరిష్కరించి, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రత్నంపేట గ్రామ ప్రజల పక్షాన సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో మండల సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్, ఇటిక్యాల రాజయ్య, రామంచ ప్రభాకర్, నాగరాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.