భద్రాద్రి జోనల్ పోలీసులకు పబ్లిక్ మేనేజ్మెంట్లో ప్రత్యేక శిక్షణ.. మడికొండ కేంద్రంగా ప్రారంభమైన తరగతులు

వరంగల్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
పండగలు, జాతరలు, ఊరేగింపుల వంటి జనసమ్మర్ధం ఉండే వేడుకల్లో ప్రజలతో పోలీసులు ఎలా మెలగాలనే అంశంపై భద్రాద్రి జోనల్ పరిధిలోని పోలీసు శిక్షకులకు మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో సోమవారం నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.
వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన మొత్తం 43 మంది ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఈ శిక్షణకు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ సమయంలో ప్రజలతో మృదువుగా, అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించే విధానాలపై తరగతి గది బోధనతో పాటు ప్రాక్టికల్ అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న మాస్టర్ ట్రైనర్లు, తమ సొంత యూనిట్లకు వెళ్లి అక్కడి సిబ్బందికి ఇదే అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రమణబాబు, ఆర్.ఐ సింహచలం శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్తో పాటు శిక్షణ కేంద్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐ.పి.ఎస్. ఈ వివరాలను వెల్లడించారు.