అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా

420 హామీలపై జిన్నారం MRO, కమిషనర్కు బీఆర్ఎస్ వినతిపత్రం
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా
జిన్నారం, తెలంగాణ అడ్డా:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల అమలుపై జిన్నారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జిన్నారం మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ జిన్నారం MRO, మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా అసెంబ్లీ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిన్నారం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం, వాటి అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు.
అసెంబ్లీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వారు విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్దన్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.