మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు: బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్

నల్ల దుస్తులతో అసెంబ్లీకి రావడం నేరమా?
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు: బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్
పటాన్చెరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా
పటాన్చెరు, తెలంగాణ అడ్డా:
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై నిరసన ధర్నా నిర్వహించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెం మధుతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం నేరమా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను అడ్డుకునే విధంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పృథ్వీరాజ్ అన్నారు. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ఎంఫీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.