రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహణ.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీపీ అంబర్ కిశోర్ ఝా

రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న సీపీ, ఫిర్యాదులను చట్టబద్ధంగా, పారదర్శకంగా, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సీపీ సూచించారు. ప్రజలకు పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.