వేములవాడలో పోటెత్తిన భక్తులు.. శ్రావణ చివరి సోమవారం సందడి

వేములవాడలో పోటెత్తిన భక్తులు.. శ్రావణ చివరి సోమవారం సందడి
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంలో ఉత్సవ మూర్తుల దర్శనం
వేములవాడ, సెప్టెంబర్ 7, తెలంగాణ అడ్డా ప్రతినిధి:
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథంలో స్వామివారి ఉత్సవ మూర్తులను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కిటకిటలాడాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, దర్శన ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.
క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షించారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడింది.