కరీంనగర్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు పకడ్బందీ ఏర్పాట్లకు అధికారుల ఆదేశం

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కరీంనగర్లో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్తో కలిసి కలెక్టర్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఏడాది జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని, అదే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూడాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రతి గణేష్ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, నిమజ్జన పాయింట్ల వద్ద భద్రత, తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి గణేష్ మండపానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిస్తుందని, లైన్మెన్ ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రజలు స్వయంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుని ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.

నిమజ్జన పాయింట్ల వద్ద ‘పక్కా’ ఏర్పాట్లు
జిల్లాలోని ప్రతి నిమజ్జన పాయిಂట్ వద్ద అవసరమైన మేరకు బ్యారికేడ్లు, క్రేన్లు, లైటింగ్, విద్యుత్, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాయిಂట్ వద్ద మెడికల్ క్యాంపు, 108 వాహనం అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. క్రేన్లకు అదనపు డ్రైవర్లు, మెకానిక్లను సిద్ధంగా ఉంచాలని, నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన సంఖ్యలో గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ 23న ప్రధాన నిమజ్జన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో విగ్రహాల ఊరేగింపు రూట్ మ్యాప్ను ముందుగానే ఖరారు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలీసుల నిఘా.. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణపోలీస్ కమిషనర్ గౌష్ ఆలమ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలోని వినాయక విగ్రహాలను మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ శాఖతో పాటు విద్యుత్, మున్సిపల్, వైద్య, ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. మండపాలు, నిమజ్జన ప్రాంతాల్లో ఏదైనా సమస్య తలెత్తితే కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకుని వెంటనే స్పందించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు వె వెల్లడించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్, యాదగిరిస్వామి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజగోపాల్రావు, డీపీవో జగదీశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కే. మహేశ్వర్, రాధాకృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, పీస్ కమిటీ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.