వేములవాడ నియోజకవర్గంలో ‘సర్’ విచారణ తేదీల షెడ్యూల్ విడుదల

వేములవాడ నియోజకవర్గంలో ‘సర్’ విచారణ తేదీల షెడ్యూల్ విడుదల
ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీ, సమయంలో విచారణ కేంద్రానికి హాజరు కావాలి: ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి
వేములవాడ, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా ప్రతినిధి):
ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా విచారణ తేదీలకు సంబంధించిన వేములవాడ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ వారీ షెడ్యూల్ను ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో అఖిలపక్ష నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం షెడ్యూల్ను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి మాట్లాడుతూ.. సంబంధిత ఓటర్లకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అందులో పేర్కొన్న తేదీ, సమయం ప్రకారం విచారణ కేంద్రానికి తప్పనిసరిగా హాజరై, సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా, పటిష్టంగా, విజయవంతంగా నిర్వహించేందుకు బీఎల్వోలు, బీఎల్ఏలతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఓటర్లు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ కోరారు.
అఖిలపక్ష సమావేశంలో పొలాస నరేందర్, మైలారం రాము, పిన్నింటి హన్మాండ్లు, చింతలకోటి రామస్వామి గౌడ్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.