కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి

కాళోజీ జీవితం ఆదర్శప్రాయం
కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి
బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత
ములుగు, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – ములుగు ప్రతినిధి):
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు. కాళోజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని సన్రైజర్స్ హైస్కూల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుమలత కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.. కాళోజీ తన కలం ద్వారా ప్రజల సమస్యలు, సామాజిక అసమానతలు, అన్యాయాలను నిర్భయంగా ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
‘నా గొడవ’ వంటి రచనల ద్వారా సమాజంలోని వాస్తవ పరిస్థితులను కాళోజీ నిర్భయంగా ఎత్తిచూపారని, సామాన్యుడి గొంతుకగా నిలిచారని సుమలత అన్నారు. పదవులు, ప్రలోభాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందించిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్యం, మానవత్వం, సామాజిక న్యాయం కోసం కాళోజీ చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని, స్రవంతి, శశికాంత్, స్వర్ణలత, అనూష, శ్రీలత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.