లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సెక్రటేరియేట్ ఉద్యోగి, టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) వైద్య ఖర్చుల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్న సచివాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆనందెషి రాఘవేందర్ (ఏవో-1), పరిష్రమ భవన్లోని టీఎస్ఐడీసీ సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ (ఏవో-2)లను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెప్టెంబర్ 10, 2026 న ఈ దాడి జరిగినట్లు ఏసీబీ పీఆర్ఓ ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.
ఫిర్యాదుదారునికి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2,00,000 చెక్కును జారీ చేయడానికి, మిగిలిన మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను ప్రాసెస్ చేయడానికి నిందితులు లంచం డిమాండ్ చేశారు. అంతకుముందు ఏవో-2 ఫోన్పే ద్వారా రూ.5,000 లంచాన్ని స్వీకరించగా, తాజాగా ఫిర్యాదుదారు నుంచి రూ.1,00,000 నగదును ఏవో-2 తీసుకుని ఏవో-1కి అందజేశారు. ఆనందెషి రాఘవేందర్ వద్ద నుంచి లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా విధులను అక్రమంగా, లబ్ది పొందే దుద్దేశంతో నిర్వహించిన నిందితులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా బాధితుడి వివరాలు గోప్యంగా ఉంచామని, కేసు దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ (9440446106) ద్వారా సంప్రదించాలని సూచించారు.