కొత్తపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

కొత్తపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
నగరంలోని కొత్తపల్లి చెరువు వినాయక నిమజ్జన ప్రాంగణాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయిలో సందర్శించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపల్లి చెరువు గణేష్ నిమజ్జన కేంద్రం వద్ద చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గణేష్ నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, వైభవంగా జరిగేలా నగరపాలక సంస్థ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నిమజ్జన ప్రదేశంలో నిరంతర విద్యుత్ వెలుగులు (లైటింగ్), భక్తులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రాంగణమంతా పరిశుభ్రత పాటిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశమున్నందున పోలీస్, మున్సిపల్, విద్యుత్ తదితర అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రజల భద్రత, భక్తుల సౌకర్యార్థం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి చిన్నపాటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వాసాల రమేష్, 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత-చంద్రశేఖర్, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.