గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకే కమ్యూనిటీ ఇంకుడు గుంతలు

గ్రామాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకే కమ్యూనిటీ ఇంకుడు గుంతలు
మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. భూగర్భ జలాల పెంపునకు సోక్పిట్లు
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలి: సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్
వీరపల్లి, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా):
గ్రామాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ ఇంకుడు గుంత (సోక్పిట్) నిర్మాణాన్ని సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్ గురువారం ప్రారంభించారు. గ్రామ వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా, వృథా నీరు భూమిలోకి ఇంకేలా ఈ నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ నాయక్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతల ఏర్పాటుతో మురుగునీటి సమస్యను తగ్గించడంతో పాటు వర్షపు నీరు, వృథా నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడుతుందని వివరించారు.
గ్రామంలో పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇళ్ల పరిసరాలతో పాటు గ్రామ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.