బంజారాహిల్స్లో మద్యం మత్తులో యువతీయువకుల వీరంగం. కారుతో ఢీకొని ఇద్దరు మహిళలకు గాయాలు

సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు జాగ్రత్త అని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా, ఎక్కడికక్కడ మైక్లో ప్రకటనలు ఇస్తున్నా కొందరు యువతీ యువకులలో మార్పురావడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో యువతీ, యువకుడు కారుతో బీభత్సం సృష్టించారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలో వోక్స్వ్యాగన్ కారుతో వారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై నానా హంగామా చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. రంజనా రాయ్ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారుతోపాటు ప్రమాదానికి కారణమైన యువతీయువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
