పంచాయతీలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆదాయం జమ చేసే అవకాశం హర్షణీయం0

గ్రామపంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేతకు కృతజ్ఞతలు
పంచాయతీలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆదాయం జమ చేసే అవకాశం హర్షణీయం
టేక్మాల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా తెలుగు దినపత్రిక):
గ్రామపంచాయతీల నిధులపై విధించిన ఫ్రీజింగ్ను ఎత్తివేయడంతో పాటు, పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పించడం హర్షణీయమని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తలారి అవినాష్ కుమార్ అన్నారు.
పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా గ్రామపంచాయతీలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలోని సర్పంచుల తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్కు రాష్ట్రంలోని సర్పంచుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ, నిధుల వినియోగంలో పారదర్శకతతో పాటు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ పెంచడం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర అభివృద్ధి పనులను వేగంగా చేపట్టేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని అన్నారు.
భవిష్యత్తులోనూ గ్రామపంచాయతీల సమస్యలను పరిష్కరిస్తూ సర్పంచులకు మరిన్ని అధికారాలు, నిధులు, నిర్ణయాధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.