కమలాపూర్ గ్రామసభలో ప్రజా సమస్యలపై గళమెత్తిన జనం

కమలాపూర్ గ్రామసభలో ప్రజా సమస్యలపై గళమెత్తిన జనం
కమలాపూర్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా న్యూస్): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ పబ్బు సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ అభివృద్ధి, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రైతులకు ఇబ్బందిగా మారిన విద్యుత్ కోతలు, నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా కాకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని మురుగు కాలువల సమస్య, రోడ్లపై ఏర్పడిన గుంతలు, పారిశుద్ధ్య లోపాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులు, వాటి అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలపై టెక్నికల్ అసిస్టెంట్ వివరించారు.
ఓటర్లకు సంబంధించిన నోటీసుల అంశంపైనా గ్రామసభలో చర్చ జరిగింది. గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
సమావేశంలో జీపీఓ, గ్రామ పరిపాలనాధికారి, విద్యుత్ శాఖ ఏఈ, పంచాయతీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామస్థులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.