'సీపీ కనెక్ట్' చొరవలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 09 మంది పోలీసు సిబ్బంది అభినందన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్

సిద్దిపేట బ్యూరో / తెలంగాణ అడ్డా:

శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన 'సీపీ కనెక్ట్' కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 09 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు మరియు ప్రత్యేక కిట్లను అందజేసి, అనంతరం వారితో ముచ్చటించారు. గత వారం రోజులుగా విధినిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సీపీ కొనియాడారు.అభినందనలు అందుకున్న వారిలో శ్రీధర్ (హుస్నాబాద్ సీఐ), లింగస్వామి (హోమ్గార్డ్, హుస్నాబాద్), సంపత్ (కోహెడ హెడ్ కానిస్టేబుల్), జి. వేణు (కోహెడ కానిస్టేబుల్), ఎం. విష్ణు చందర్ (గౌరారం పోలీస్ కానిస్టేబుల్), రవి (గౌరారం పోలీస్ కానిస్టేబుల్), బి. రాకేష్, బి. కార్తీక్, ఎం. సాహితీ (ముగ్గురు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్స్) ఉన్నారు.ఈ సందర్భంగా రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను ఉపయోగించి పాత నేరస్థులను పట్టుకోవడం, బందోబస్తులో అత్యుత్తమ విధులు నిర్వర్తించడం, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం అభినందనీయమని సీపీ పేర్కొన్నారు. ఇదే నిబద్ధతతో సిబ్బంది అంతా పనిచేసి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయడానికి 'సీపీ కనెక్ట్' చొరవ ద్వారా మరింత బలమైన, సమైక్య మరియు స్పందించే బృందాన్ని నిర్మించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.