ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు దమనకాండకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులని కూడా చూడకుండా ఇష్టారీతిన గొడ్డును బాదినట్లు చావబాదడం, కాళ్లు, చేతులు విరగ్గొట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.ఈ పోలీసుల దాడి తీవ్రతకు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడమే నిదర్శనమని తెలిపారు. తోటి నాయకులు వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని, లేదంటే పరిస్థితి ఎంత విషమంగా ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నిరసనలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న పోలీసులు, ప్రతిపక్ష పార్టీలు మరియు విద్యార్థి సంఘాలపై మాత్రం అమానుషంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రశ్నించే గొంతులను అణచివేసి భయపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ సర్కార్కు పోయే కాలం దాపురించిందని పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, జీవో నంబర్ 9ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.