గణేష్ చతుర్థిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లికా అశోక్

మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
గణేష్ చతుర్థిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లికా అశోక్
టేక్మాల్, తెలంగాణ అడ్డా తెలుగు దినపత్రిక:
గణేష్ చతుర్థి పర్వదినాన్ని జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లికా అశోక్ కోరారు.
విఘ్నేశ్వరుడి కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గణపతి ఆశీస్సులతో జిల్లాలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రజల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడాలని కోరుకున్నారు.
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి గణేష్ విగ్రహాలనే వినియోగించాలని ఆమె సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున వాటిని వినియోగించకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పట్లోళ్ల మల్లికా అశోక్ పిలుపునిచ్చారు.