బోయినిపల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులకు విత్తన గణపతి విగ్రహాల పంపిణీ

విత్తన గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
బోయినిపల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులకు విత్తన గణపతి విగ్రహాల పంపిణీ
తెలంగాణ అడ్డా ప్రతినిధి, బోయినిపల్లి:
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన విత్తన గణపతి విగ్రహాలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ కమల్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండయ్య మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అదే స్ఫూర్తితో వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా మట్టి గణపతి విగ్రహాలను విత్తనాలతో రూపొందించడం అభినందనీయమన్నారు.
విత్తన గణపతిని నవరాత్రుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన అనంతరం ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు. విగ్రహం నీటిలో కరిగిన తర్వాత అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదుగుతుందని, తద్వారా పూజించిన గణపతి విగ్రహం మొక్క రూపంలో మన ఇంటి ఆవరణలోనే పెరుగుతూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు.
పర్యావరణ హితమైన విత్తన గణపతులను బోయినిపల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులకు అందజేసిన జోగినిపల్లి సంతోష్ కుమార్కు ఈ సందర్భంగా కొండయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.