Back to Home
Watermark
సోమవారం, 14 సెప్టెంబర్, 2026 TIME : 10:05 AM

మట్టి కుప్పలతో నరకప్రాయంగా మారిన రహదారి ఏడాది గడిచినా పూర్తికాని రోడ్డు పనులు

Main Image

మట్టి కుప్పలతో నరకప్రాయంగా మారిన రహదారి

ఏడాది గడిచినా పూర్తికాని రోడ్డు పనులు

వాహనదారులు, స్థానికులకు తప్పని తిప్పలు

వర్షం పడితే బురదమయంగా మారుతున్న రహదారి

తక్షణమే పనులు పూర్తి చేయాలని తండావాసుల డిమాండ్

వీర్నపల్లి, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా ప్రతినిధి): వీర్నపల్లి మండల పరిధిలోని భవుసింగ్ నాయక్ తండాలో దుర్గమ్మ టెంపుల్‌ నుంచి గుడారం రోడ్డు వరకు రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. రహదారి మరమ్మతుల కోసం ఏడాది క్రితం మట్టి కుప్పలు పోసి పనులు ప్రారంభించకుండానే వదిలేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రమాదకరంగా మారిన మట్టి కుప్పలు

రోడ్డు నిర్మాణ పనుల కోసం ఏడాది క్రితం పెద్దఎత్తున మట్టి పోశారు. అయితే పనులు ముందుకు సాగకపోవడంతో ప్రస్తుతం మట్టి కుప్పలు రహదారిపై అడ్డంకులుగా మారాయి. ఎత్తుపల్లాలతో ఉన్న రహదారిపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడే పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే బురదమయమే

వర్షాలు కురిసిన సమయంలో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. మట్టి బురదగా మారడంతో వాహనాలు కూరుకుపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వాహనాలకు కూడా రాకపోకలు కష్టంగా మారుతున్నాయని తెలిపారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..

రహదారి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా పనులు నిలిచిపోయినా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే పనులు పూర్తి చేయాలి

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారిపై పేరుకుపోయిన మట్టి కుప్పలను తొలగించి, పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని భవుసింగ్ నాయక్ తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారిని ప్రయాణయోగ్యంగా మార్చాలని కోరుతున్నారు.

Clip Adjustments