ఎల్ఎండి కట్టపైనే భారీ వృక్షాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారుల నిర్లక్ష్యం

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కరీంనగర్లోని లోయర్ మనేర్ డ్యామ్ (ఎల్ఎండి) కట్టపై పెరుగుతున్న చెట్ల విషయంలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, డ్యామ్ కట్ట తెగిపోయి ప్రజలు నీట మునిగి కొట్టుకుపోవాలని చూస్తున్నారా అంటూ స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డ్యామ్ కట్ట వెంబడి పెద్ద ఎత్తున పెరిగిపోయిన భారీ వృక్షాలను చూపిస్తూ అధికారులు గాఢ నిద్ర నుంచి ఎప్పుడు లేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు.
డ్యామ్ కట్ట పైన మట్టిలో పెరిగిన ఈ చెట్ల వేర్లు సుమారు పది అడుగుల లోతుకు చొచ్చుకుపోయి కట్టను బలహీనపరుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల ఈ ఉదాసీన వైఖరి వల్ల భవిష్యత్తులో భారీ ప్రాణ, ఆస్త నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు కట్టను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పెను ముప్పును కొనితెస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు నీటిపారుదల శాఖ పర్యవేక్షణ అధికారులు తక్షణమే స్పందించి, ఇప్పటికైనా కట్టపై ఉన్న చెట్లను తొలగించి, అవసరమైన గ్రౌటింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.